Moviesమ‌హేష్‌బాబును కెలికేసిన ప‌వ‌న్‌... ఇంత ర‌చ్చ ఏందిరా సామీ..!

మ‌హేష్‌బాబును కెలికేసిన ప‌వ‌న్‌… ఇంత ర‌చ్చ ఏందిరా సామీ..!

టాలీవుడ్ లో ఒకేసారి ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితే… ఆ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఎంత హంగామా ఉంటుందో చెప్పక్కర్లేదు. అలాగే ఇద్దరి హీరోల అభిమానులు కూడా తమ హీరో సినిమాయే హిట్ అవ్వాలని… రికార్డులు సాధించాలని పంతాలకు కూడా పోతూ ఉంటారు. రెండేళ్ల క్రితం సంక్రాంతి కానుకగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు – బన్నీ అలవైకుంఠపురంలో సినిమాలు వచ్చినప్పుడు దాదాపుగా ఇద్దరు హీరోలు పంతాలకు పోయినట్టే కనిపించింది. ఎవరు వెనక్కు తగ్గకుండా ఒకే రోజు తమ సినిమాలు రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో మహేష్ సినిమా ఒకరోజు ముందుగా రిలీజ్ అయింది.

సినిమాలు రిలీజ్ అయ్యాక కూడా రికార్డులు, కలెక్షన్ల‌ విషయంలో ఆ సినిమాల మేకర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే చేసుకున్నారు. ఎంత లేదన్నా ఆ సంఘటన తర్వాత బన్నీ – మహేష్ అభిమానుల మధ్య యుద్ధం కొనసాగుతూనే వస్తోంది. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి యుద్ధం మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య తప్పదన్నట్టుగా కనిపిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహేష్ 28వ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే యేడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చి మూడు రోజులు అయిందో లేదో.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో వస్తోన్న హరిహర వీరమల్లు సినిమాను ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పీరియాడిక్ సినిమా కావడం వల్లే ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతోంది.
నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాకు కీర‌వాణి సంగీత ద‌ర్శ‌కుడు.

అయితే ముందుగా మహేష్ బాబు సినిమాను ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చిన మూడు రోజులకే పవన్ సినిమాను… ఆ మరుసటి రోజు ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడం మహేష్ బాబు అభిమానులను బాగా కెలికినట్టు అయింది. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య రచ్చ స్టార్ట్ అయింది. మ హీరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన రెండు రోజులకే… కావాలని కవ్విస్తూ హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ప్రకటించారని మహేష్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

అయితే హరిహర వీరమల్లు రిలీజ్ కష్టాలు చాలానే ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. వచ్చే సంక్రాంతికి వచ్చే పరిస్థితి లేదు. పైగా ఏప్రిల్ 14న చిరంజీవి భోళాశంకర్ వస్తోంది. ఏప్రిల్ లో కాదనుకుంటే మేలో సినిమా రిలీజ్ చేయాలి. అప్పటివరకు పవన్ సినిమా రాకపోతే అభిమానులు మరింత డీలా పడిపోతారు. ప‌వ‌న్ క‌మిట్‌మెంట్లు చాలానే ఉన్నాయి. పైగా ఎన్నికలు ముంచుకొస్తున్నాయి.

గత్యంతరం లేని పరిస్థితుల్లోనే హరిహర వీరమల్లు సినిమాను ఏప్రిల్ 29న రిలీజ్ చేయాలని నిర్మాత ఏఎం. రత్నం నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అయితే ఇద్దరు హీరోల సినిమాలు ఒక రోజు తేడాలో రిలీజ్ అయితే ఖ‌చ్చితంగా కలెక్షన్లు… రికార్డులపై దెబ్బ పడటం ఖాయం అని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇద్దరు హీరోలలో ఎవరైనా వెనక్కు తగ్గుతారేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news