టాలీవుడ్ లో సీనియర్ హీరోలుగా ఉన్న నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు కూడా నాలుగు దశాబ్దాలుగా సక్సెస్ ఫుల్గా తమ కెరీర్ కొనసాగిస్తూ వస్తున్నారు. తరాలు మారిపోయాయి.. ఎంతోమంది కుర్ర హీరోలు తెలుగు సినిమా రంగంలోకి దూసుకొచ్చి సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పటికీ చిరంజీవి, బాలయ్య ఇద్దరు కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ చకచకా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. వచ్చే సంక్రాంతికి కూడా వీరిద్దరూ తమ సినిమాలు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యతో బాక్సాఫీస్ దగ్గర పోటీపడుతున్నారు.
బాలయ్య – చిరు ఇద్దరు కూడా ముందు నుంచి వేరువేరు కాంపౌండ్లకు స్టార్ హీరోలుగా కొనసాగుతూ వస్తున్నారు. నందమూరి కాంపౌండ్ నుంచి బాలయ్య స్టార్ హీరోగా ఉంటే, మెగా కాంపౌండ్ నుంచి చిరంజీవి స్టార్ హీరోగా కొనసాగారు. దీంతో వీరిద్దరి సినిమాల విషయంలో గత 40 సంవత్సరాలుగా ఎప్పుడు తీవ్రమైన పోటీ ఉంటూ వస్తోంది. ఇక అభిమానులు కూడా ఎవరికి వారే తమ హీరో గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే సహజంగా చిరు, బాలయ్య మధ్య ఈ విషయంపై కంపేరిజన్ జరిగిన పెద్ద రచ్చ రచ్చగా మారుతూ ఉంటుంది.
అలాంటిది ఈ ఇద్దరు హీరోలను పెట్టి మల్టీస్టారర్ తీయడం అంటే జరిగే పనేనా ? అయితే వీరిద్దరు కెరీర్ పరంగా పీక్స్లో ఉన్న టైంలో ఆ ప్రయత్నాలు జరిగాయి. అప్పట్లో స్టార్ డైరెక్టర్గా ఉన్న కోదండ రామిరెడ్డి తానే నిర్మాతగా.. తన సొంత బ్యానర్లో చిరు – బాలయ్య మల్టీస్టారర్ ప్లాన్ చేశారు. అసలు చిరంజీవి కెరీర్లో ఎక్కువ సూపర్ హిట్లు ఇచ్చి ఆయన కెరీర్ను టర్న్ చేసిందే కోదండ రామిరెడ్డి. చిరు కెరీర్ను ఖైదీతో ఒక్కసారిగా సూపర్స్టార్ రేంజ్కు తీసుకువెళ్లడంతో పాటు చిరుకు మాస్లో తిరుగులేని ఇమేజ్ వచ్చేసింది.
ఇక కోదండ రామిరెడ్డి బాలయ్యకు కూడా ఎన్నో బ్లాక్బస్టర్ హిట్లు ఇచ్చాడు. కోడి రామకృష్ణ తర్వాత కోదండ రామిరెడ్డి సినిమాలే బాలయ్య కెరీర్కు మంచి హైప్ ఇచ్చాయి. అందుకే చిరు – బాలయ్య కాంబినేషన్లో కోదండ రామిరెడ్డి సినిమా అనుకున్నారు. చిరు – బాలయ్య కూడా కలిసి నటించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే ఇద్దరి ఇమేజ్లను బ్యాలెన్స్ చేసే కథ ఎప్పటకి దొరకలేదు. ఎన్ని కథలు విన్నా ఇద్దరు హీరోల పాత్రల సమతూకంలో ఎక్కడో తేడా కొడుతోంది. దీంతో కోదండ రామిరెడ్డే చివరకు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. అలా చిరు – బాలయ్య మల్టీస్టారర్ పట్టాలు ఎక్కలేదు.