సాధారణంగా సినిమా రంగంలో ఉన్నవారు.. ప్రచారం కోరుకుంటారు. వారు వస్తున్నారంటే.. హంగు ఆర్భా టాలకు కొరత లేకుండా చేసుకుంటారు. ముఖ్యంగా పాతతరం అయినా.. కొత్తతరం అయినా.. హీరోలు, హీరోయిన్లు ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ప్రచారం ఉంటనే పదిమందికి తెలుస్తామనే మాట కూడా వినిపిస్తుంది. అంజలీదేవి, భానుమతి వంటివారు కూడా ప్రచారానికి ఎక్కువ గా ప్రాధాన్యం ఇచ్చేవారు.
కానీ, వీరికన్నా ముందు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన కాంచనమాల(ఓల్డ్) సూపర్హిట్ సినిమాల్లో నటించినా.. ఎక్కడా ప్రచారం కోరుకోలేదు. ఎప్పుడూ కూడా నటనపైనే దృష్టి పెట్టేవారట. ఈ ప్రచారాలన్నీ .. తాత్కాలికం.. మన నటనే మనకు దివ్యాయుధం. నటనలో బాగుంటేనే మర్యాద, గౌరవం.. అని చెప్పేవారట. అక్కినేని, అన్నగారు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లక ముందే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకున్న కాంచనమాల.. తెనాలికి చెందినవారు.
అప్పట్లో 1930లలోనే ఆమె భారీ పారితోషికం తీసుకున్నారనట. ఒక్క సినిమాకు 10 వేలు చొప్పున తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నిజానికి అప్పట్లో ఉద్యోగాలు ఉండేవి. నెలకు 100 రూపాయలు ఇస్తే ఎక్కువ అన్నట్టుగా పరిస్థితి ఉండేది. కానీ, కాంచనమాల మాత్రం రెమ్యునరేషన్ కోసం పట్టుబట్టి మరీ తీసుకునేవారు. ఇక, ఆమె గోప్యత విషయానికి వస్తే.. పక్కనే ఉన్నవారికి కూడా ఆమె గురించి తెలియదంటే ఆశ్చర్యం వేస్తుంది.
సొంత ఊరు తెనాలిలో శాంతి భవనం పేరుతో విశాలమైన ఇంటిని నిర్మించుకున్నారు. సినిమాలు లేనప్పుడు అక్కడకు వచ్చి విశ్రాంతి తీసుకునేవారు. అయితే, ఆమె వచ్చినట్టు కానీ.. ఉన్నట్టు కానీ.. పక్కింటి వారికి కూడా తెలిసేది కాదట. జి.వరలక్ష్మి, కృష్ణవేణి వంటి హీరోయిన్లు.. కాంచనమాల నుంచి స్ఫూర్తి పొంది అంతే క్రమశిక్షణతో మెలిగారంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటికీ కొన్ని పాతతరం స్టూడియోల్లో కాంచనమాల ఫొటోలు ఉంటాయి.