Moviesచిరు మిస్ అయిన వెంక‌టేష్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌… తెర‌వెన‌క చాలా జ‌రిగింది…!

చిరు మిస్ అయిన వెంక‌టేష్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌… తెర‌వెన‌క చాలా జ‌రిగింది…!

అగ్ర హీరో.. వెంక‌టేష్ న‌టించిన సినిమా.. కొండ‌ప‌ల్లి రాజా. ఈ సినిమా సూప‌ర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో న‌గ్మా అభినయం.. ద్వంద్వార్థ ప‌దాల‌తో న‌టించిన తీరు మాస్ యువ‌త‌ను క‌ట్టిపడేసింది. అయితే.. ఈ సినిమా వెనుక చాలానే క‌థ న‌డిచింద‌ని సీని వ‌ర్గాల టాక్‌. అస‌లు ఈ సినిమాను మొద‌ట్లో చిరంజీవితో చేయాల‌ని అనుకున్నార‌ట‌. ఆయ‌న‌కు క‌థ కూడా చెప్పారు. న‌చ్చేసింది. అయితే.. అనూహ్యంగా హీరో వెంక‌టేష్ చేస్తాన‌నే స‌రికి.. మొత్తం ప్లాన్ రివ‌ర్స్ అయింది.

ఏం జ‌రిగిందంటే…!
తమిళ చిత్రరంగ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన చిత్రం ‘అణ్ణామలై’. ఈ సినిమాను తెలుగులో తీసేందుకు హక్కుల కోసం తెలుగు నిర్మాతలు పోటీ పడ్డారు. ఈ క్ర‌మంలో నిర్మాత కేవీవీ సత్యనారాయణ ఎక్కువ మొత్తం ఇచ్చి.. కొన్నారు. తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవితో తీస్తే బాగుంటుందని సత్యనారాయణ ఆలోచన. అదే సమయంలో ఆయ‌న వెంకటేష్‌తో ‘సుందరకాండ’ చిత్రం నిర్మిస్తున్నారు.

ఓ స‌మ‌యంలో చెన్నై నుండి హైదరాబాద్‌లోకు ఫ్లైట్‌లో వస్తుంటే స‌త్య‌నారాయ‌ణ‌కు చిరంజీవి తార‌స‌ప‌డ్డారు. దీంతో కథను, తన మనసులోని మాటను వినిపించారు. చిరంజీవికి ఆ కథ బాగా నచ్చింది. తప్పకుండా చేస్తానని మాట ఇచ్చారు. డేట్స్‌ చెబుతాననీ అన్నారు. అయితే.. ‘అణ్ణామలై’ రీమేక్‌ రైట్స్‌ తీసుకున్నారనే సమాచారం వెంకటేష్‌కు తెలిసింది.

నిర్మాత స‌త్య‌నారాయ‌ణ (సుంద‌ర‌కాండ‌) షూటింగ్‌ స్పాట్‌లోకి అడుగుపెట్టగానే ‘అణ్ణామలై’ సినిమా కూడా మనమే చేద్దాం అని ఆయనతో చెప్పారు వెంకటేష్‌. ఆ మాట విని షాక్‌ అయ్యారు నిర్మాత‌. ఆ విషయానికి ఆనందించాలో, లేక నంబర్‌ వన్‌ హీరో (చిరు)తో సినిమా చేసే ఛాన్స్‌ మిస్‌ అవుతున్నందుకు బాధపడాలో తెలియలేదు. చివ‌ర‌కు నిర్మాత రామానాయుడు ఇచ్చిన స‌ల‌హాతో ‘కొండపల్లి రాజా’ చిత్రం మొదలైంది. ఈ సినిమా కూడా వంద రోజులు ఆడింది. అయితే.. చిరుతో చేయాల‌ని అనుకుని చేయ‌లేక పోవ‌డం నిర్మాత‌కు వెలితిగా మిగిలిపోయింద‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news