Moviesచిరంజీవి, బాల‌య్య ఫ్యాన్స్‌కు బిగ్ షాక్‌... ఏపీ, తెలంగాణ‌లో 200 సెంట‌ర్ల‌లో...

చిరంజీవి, బాల‌య్య ఫ్యాన్స్‌కు బిగ్ షాక్‌… ఏపీ, తెలంగాణ‌లో 200 సెంట‌ర్ల‌లో నో రిలీజ్‌…!

టాలీవుడ్ లో వచ్చే సంక్రాంతికి భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలకు బిగ్ షాక్ తగలనుంది. తమ అభిమాన హీరోల సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతుండడంతో ఇద్దరు హీరోల అభిమానులు ఎప్పుడు సినిమా చూస్తామా అని ఆశల పల్లకిలో మునిగితేలుతున్నారు. అయితే టాలీవుడ్ లో ఇప్పటికే థియేటర్ల మాఫియా పై రకరకాల విమర్శలు ఉన్నాయి. చిన్న హీరోల సినిమాలకు.. చిన్న నిర్మాతల సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా పెద్ద ఎత్తున రాజకీయాలు నడుస్తున్నాయి అన్న విమర్శలు గత ఏడు ఎనిమిది సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం.

అయితే ఇప్పుడు నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకు కూడా థియేటర్లు దొరకని పరిస్థితి. కోలీవుడ్ హీరో విజయ్ నటిస్తున్న వారసుడు దిల్ రాజు సొంత సినిమా. అది డబ్బింగ్ సినిమా అయినా కూడా ఆంధ్ర, తెలంగాణలో దిల్ రాజు సొంత థియేటర్లతో పాటు ఆయన ఆధీనంలో ఉండే ఎగ్జిబిటర్ల థియేటర్లలో కూడా వారసుడు సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.

ఆంధ్ర, తెలంగాణలో కేవలం సింగిల్ స్క్రీన్లు ఉన్న 200 సెంటర్లలో వారసుడు సినిమా మాత్రమే ప్రదర్శించాలని ఇప్పటికీ అగ్రిమెంట్లు జరిగిపోయినట్టు తెలుస్తోంది. అంటే ఈ రెండువందల సెంటర్లలో బాలయ్య, చిరంజీవి సినిమాలు రిలీజ్ కావు. ఇక్కడ కేవలం వారసుడు సినిమా మాత్రమే వేస్తారు. అంటే తెలుగు వాళ్లకు పెద్ద పండుగ అయిన సంక్రాంతికి తెలుగు స్టార్ హీరోల‌ సినిమా చూసే భాగ్యం ఈ 200 సెంటర్లలో ఉండదు.

ఇక డబుల్ స్క్రీన్లు ఉన్న పల్లెటూర్లు.. చిన్న చిన్న పట్టణాల్లో వారసుడు సినిమా ఖచ్చితంగా ఉంటుంది. ఇక రెండో సినిమాగా అయితే బాలయ్య లేదా చిరంజీవి సినిమాలలో ఒకటి మాత్రమే ఉంటుంది. మరో హీరో సినిమా ఇక్కడ చూసే ఛాన్స్ ఉండదు. ఒకవేళ వారసుడు సినిమాకు ప్లాప్ టాక్‌ వచ్చినా, కలెక్షన్లు లేకపోయినా బాలయ్య లేదా చిరంజీవి సినిమా వేసుకునే ఛాన్స్ లేకుండా మరో ట్విస్ట్ ఇస్తున్నారు. యూవీ సంస్థ నిర్మించిన చిన్న సినిమా కళ్యాణం కమనీయం జనవరి 14న విడుదలవుతోంది.

వారసుడు ఖాళీ చేసే స్క్రీన్లు అన్నీ కూడా ఆ సినిమాకు వెళ్లే ప్లానింగ్ జరుగుతోంది. అంటే వీరసింహారెడ్డి లేదా వాల్తేరు వీరయ్య సినిమాలను పూర్తిగా అణ‌గదొక్కే రాజకీయమే ఇక్కడ జరుగుతుందన్న చర్చలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఆంధ్ర – తెలంగాణలో దాదాపు 200కు పైగా చిన్న చిన్న పల్లెటూర్లు, సెంటర్లలో బాలయ్య -చిరంజీవి సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్సులు కనపడటం లేదు. ఆ హీరోల అభిమానులకు ఇంత‌కు మించిన బిగ్ షాక్ ఏముంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news