Newsతెలంగాణలో మ‌రో ప్రేమ‌జంట‌పై కుటుంబీకుల దాడి...

తెలంగాణలో మ‌రో ప్రేమ‌జంట‌పై కుటుంబీకుల దాడి…

తెలంగాణ‌లో ఇటీవ‌ల ప్రేమ హ‌త్యలు, ప్రేమ నెపంతో ప‌రువు హ‌త్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. తాజాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట‌పై యువ‌తి కుటుంబీకులు దాడి చేశారు. నిర్మ‌ల్ జిల్లాలోని భైంసాకు చెందిన నాగ‌జ్యోతి, అక్ష‌య్ 2019 మే 28 న ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరు 15 నెల‌ల పాటు కాపురం కూడా చేశారు. అయితే నెల రోజుల క్రితం నాగ‌జ్యోతిని ఆమె కుటుంబ స‌భ్యులు త‌ల్లికి గుండె నొప్పి వ‌చ్చింద‌ని చెప్పి ఇంటికి పిలిపించుకున్నారు.

 

మాకు న‌చ్చ‌ని పెళ్లి చేసుకున్నావు.. విడాకులు తీసుకోవాలంటూ ఆమెపై ఒత్తిడి చేస్తున్నారు. విడాకులు ఇవ్వ‌క‌పోతే అక్షయ్‌ని చంపేస్తామని బెదిరించి ఆగస్టులో విడాకులు ఇప్పించారు. అయినా నాగ‌జ్యోతి, అక్ష‌య్ మాట్లాడుకుంటున్నారు. బుధ‌వారం ప‌రీక్ష‌ల సంద‌ర్భంగా నాగ‌జ్యోతి క‌ల్లూరు వాస‌వి డిగ్రీ కాలేజ్‌లో పరీక్ష‌లు రాసేందుకు వెళ్లింది.

 

త‌ర్వాత అక్ష‌య్‌తో క‌లిసి ద్విచ‌క్ర వాహ‌నంపై వస్తుండ‌గా ఆమె ముగ్గురు సోద‌రులు వారిని వెంబ‌డించి కారుతో వారి బైక్‌ను ఢీ కొట్టారు. నాగజ్యోతికి తీవ్రగాయాలు కాగా, అక్షయ్‌పై కర్రతో దాడిచేశారు. నాగజ్యోతి, అక్షయ్‌ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు భైంసా గ్రామీణ ఎస్‌ఐ పున్నంచందర్‌ తెలిపారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news