Movies' బింబిసార ' టాలీవుడ్‌కే కాదు నంద‌మూరి ఫ్యామిలీకి ఎంత ప్ల‌స్...

‘ బింబిసార ‘ టాలీవుడ్‌కే కాదు నంద‌మూరి ఫ్యామిలీకి ఎంత ప్ల‌స్ అయ్యిందంటే…!

టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీది 60 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైన చరిత్ర. దివంగత నటరత్న‌
ఎన్టీఆర్ వేసిన పునాదితో ఇప్పటికీ మూడో తరంలో నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోలు వచ్చి స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ తర్వాత ఆ వంశం నుంచి రెండో తరంలో ఆయన తనయులు హరికృష్ణ- బాలకృష్ణ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. హరికృష్ణ తక్కువ సంఖ్యలో సినిమాలు చేశారు. అయితే బాలయ్య మాత్రం తన తండ్రికి తగ్గ నటవరసుడిగా నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతూ వస్తున్నారు. ఇక మూడో తరంలో హరికృష్ణ ఇద్దరు తనయులు కళ్యాణ్ రామ్- ఎన్టీఆర్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు.

జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లోనే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు. తాజాగా వచ్చిన “త్రిబుల్ ఆర్” సినిమాతో ఎన్టీఆర్ ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇక పటాస్ తర్వాత సరైన హిట్ సినిమాలేని కళ్యాణ్ రామ్‌కు తాజాగా వచ్చిన బింబిసార సినిమాతో కెరీర్లోనే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది.
జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి తర్వాత నందమూరి ఫ్యామిలీలో కొంత గ్యాప్ పెరిగింది అన్నది వాస్తవం. ఎందుకో గాని హరికృష్ణ – బాలకృష్ణ మధ్య అంత సఖ్యత ఉన్నట్టుగా అనిపించేది కాదు. దీనికి తోడు పార్టీ పరంగా కూడా నందమూరి అభిమానులు.. తెలుగుదేశం అభిమానులు.. బాలయ్య – ఎన్టీఆర్ అభిమానులుగా చీలిపోయారు.

హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ మరణం తర్వాత ఈ రెండు కుటుంబాలు కాస్త కలిసినట్టు ఉన్న ఆ తర్వాత మళ్లీ ఆ గ్యాప్ అలాగే కంటిన్యూ అయినట్టుగా అనిపించింది. హరికృష్ణ మరణం తర్వాత కలిసి కలవనట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు. దీనికి తోడు రాజకీయపరమైన సమీకరణలు కూడా ఎన్టీఆర్‌కు నందమూరి, నారా ఫ్యామిలీతో కాస్త దూరం పెరగటానికి కారణ‌మైన‌ట్టుగా ఉండేది. నందమూరి ఫ్యామిలీలో ఎన్ని హిట్ నిమాలు వస్తున్నా హీరోలు మాత్రం చాలా తక్కువ సందర్భాల్లో కలిసి కనిపిస్తుండడంతో అభిమానుల్లోనూ ఎక్కడో ఏదో తెలియని వెలితి అయితే ఉంది.

తాజాగా వచ్చిన బింబిసార‌ ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయింది. ఈ సినిమా కళ్యాణ్ రామ్‌కు ఆల్ టైం కెరీర్ హిట్ సినిమాగా నిలవడం మాత్రమే కాదు.. ప్రేక్షకులు లేక వెలవెలబోతున్న థియేటర్లకు మంచి ఊపు ఇచ్చి టాలీవుడ్‌కు సరికొత్త కళ ఇచ్చింది. అటు ఈ సినిమా సక్సెస్‌తో నందమూరి కుటుంబం అంతా ఒక్కటైనట్టుగా కనిపించింది. తాజాగా ఈ సినిమా స్పెషల్ షోకు కళ్యాణ్ రామ్ తన బాబాయి బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబాన్ని మొత్తం ఆహ్వానించారు.

ఈ సినిమా చూసిన బాలకృష్ణ సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలపడంతో పాటు దర్శకుడు వశిష్ఠ్‌ తొలి సినిమాతోనే సాహసోపేతమైన ప్రయోగం చేశారని మెచ్చుకున్నారు. అలాగే కొత్త తరాన్ని ప్రోత్సహించాలన్న వైవిద్యమైన కథలతో సినిమాలు చేయాలన్నా అది కేవలం నందమూరి కుటుంబానికి మాత్రమే సొంతం అని బాలయ్య అన్నారు. బాలయ్య ఈ సినిమా గురించి మాట్లాడడంతో బాలయ్య అభిమానులు సైతం బింబిసార‌ను ఇప్పుడు నెత్తిన పెట్టుకున్నారు. అందుకే రెండో వారంలోనూ బింబిసార‌ స్టడీ వసూళ్లతో దూసుకుపోతోంది.

బాలయ్య మాత్రమే కాదు ఆయన తనయుడు మోక్షజ్ఞ – భార్య వసుంధర – ఎన్టీఆర్ ఇద్దరు కుమార్తెలు లోకేశ్వరి- కేంద్ర మాజీ మంత్రి పురందరేశ్వరి వాళ్ళ కుటుంబాలతో సహా హాజరై ఈ సినిమా స్పెషల్ షోను వీక్షించారు. ఏదేమైనా చాలా రోజుల తర్వాత నందమూరి కుటుంబం మొత్తం ఒకే వేదిక పైకి రావడంతో పాటు వారిలో ఫుల్ జోష్ కనిపించింది. ఈ వాతావరణం చూసిన నందమూరి అభిమానులు కూడా ఉత్సాహంతో ఉన్నారు. తాము ఎప్పటినుంచో కోరుకుంటోంది ఇదే కదా ? అని వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఊపులో నందమూరి హీరోల మల్టీస్టారర్ కూడా ఫిక్స్ అయితే అభిమానులకు అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news