Moviesబాల‌య్య ' భైర‌వ‌ద్వీపం ' సినిమాకు ఎన్టీఆర్‌, ర‌జ‌నీకాంత్‌, చిరంజీవితో ఉన్న...

బాల‌య్య ‘ భైర‌వ‌ద్వీపం ‘ సినిమాకు ఎన్టీఆర్‌, ర‌జ‌నీకాంత్‌, చిరంజీవితో ఉన్న లింక్ ఇదే..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ కెరీర్‌లో ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు చేశారు. చారిత్ర‌కం, పౌరాణికం, జాన‌ప‌దం, సాంఘీకం ఇలా ఏ పాత్ర‌లో అయినా బాల‌య్య ఇమిడిపోతాడు. త‌న తండ్రి ఎన్టీఆర్ త‌ర్వాత ఆ రేంజ్‌లో ఏ పాత్ర‌లో అయినా జీవించ‌డం బాల‌య్య‌కు మాత్ర‌మే సాధ్యమైంది. బాల‌య్య కెరీర్‌లో వ‌చ్చిన జాన‌ప‌ద చిత్రం భైర‌వ‌ద్వీపం ఆయ‌న కెరీర్‌లో వ‌చ్చిన సినిమాల్లో టాప్ ప్లేసులో ఉంటుంది. ఈ సినిమా తెర‌కెక్క‌డం వెన‌క చాలా చిత్ర విచిత్రాలే జ‌రిగాయి.

విజ‌యా సంస్థ‌లో అంత‌కుముందు సింగీతం శ్రీనివాస‌రావు బృందావ‌నం సినిమా చేసి మంచి హిట్ కొట్టారు. దీంతో విజ‌యా వారు తాము తీయాల‌ని అనుకున్న జాన‌ప‌ద సినిమాకు కూడా సింగీతంనే ద‌ర్శ‌కుడిగా అనుకున్నారు. అయితే పాతాళభైర‌వి లాంటి జాన‌ప‌థ క‌థ‌తో ముందు సినిమా తీయాల‌ని అనుకున్నారు. ఇంత‌లో ర‌చ‌యిత రావి కొండ‌ల‌రావు మంచి మ‌లుపులతో కూడిన జాన‌ప‌ద క‌థ‌ను అల్లుకున్నారు.

ఈ క‌థ విన్న వెంట‌నే బాల‌య్య‌కు కొత్త‌గా అనిపించింది. త‌న తండ్రి న‌టించిన పాతాళ‌భైర‌విలా ఉండ‌డంతో వెంట‌నే ఓకే చెప్పేశాడు. హీరోయిన్‌గా అప్ప‌ట్లో మాంచి జోరుమీదున్న రోజాను తీసుకున్నారు. బాల‌య్య‌కు త‌ల్లిగా కేఆర్‌. విజ‌య‌, తండ్రిగా విజ‌య్‌కుమార్‌, పెంపుడు త‌ల్లిదండ్రులుగా రాధాకుమారి, భీమేశ్వ‌ర‌రావును తీసుకోగా గురువుగా మిక్కిలినేని, య‌క్షిణిగా రంభ‌ను, మిగిలిన పాత్ర‌ల‌కు బాబూమోహ‌న్‌, ప‌ద్మ‌నాభం, సుత్తివేలు ఎంపిక‌య్యారు.

ఇక ఈ సినిమాలో భేతాళ మాంత్రికుడి పాత్ర కోసం ఎస్‌వి. రంగారావు లాంటి వాళ్లు కావాల‌ని అనుకున్నారు. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ న‌టులు నానా ప‌టేక‌ర్‌, అమ్రిష్ పురి పేర్లు ప‌రిశీలించారు. చివ‌ర‌కు మ‌ళ‌యాళ న‌టుడు రాజ్‌కుమార్‌ను తీసుకున్నారు. విల‌న్ పాత్ర‌కు విజ‌య సంస్థ‌లోని విజ‌య‌, రంగారావు పేరులోని రంగాను తీసుకుని విజ‌య రంగ‌రాజా అని పేరు పెట్టారు.

ఈ సినిమాకు ఎస్ఎస్‌. లాల్ కుమారుడు క‌బీర్ లాల్‌ను సినిమాటోగ్రాఫ‌ర్‌గా తీసుకున్నారు. క‌బీర్‌లాల్ అంత‌కుముందే సింగీతం ద‌ర్శ‌క‌త్వంలో ఆదిత్య 369 సినిమాకు ప‌నిచేసి ఉన్నాడు. 1993 జూన్ 5న మ‌ద్రాస్ వాహినీ స్టూడియోలో వేసిన సెట్‌లో షూటింగ్ ప్రారంభ‌మైంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్స‌వంలో ఓ ట్విస్ట్ జ‌రిగింది. ముహూర్తం షాట్ రోజా – బాల‌కృష్ణ మీద షూట్ చేశారు. ర‌జనీకాంత్ క్లాప్ ఇవ్వ‌గా, చిరంజీఇ స్విచ్ ఆన్ చేశారు. ఎన్టీఆర్ గౌర‌వం ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

1994 ఏప్రిల్ 14న రిలీజ్ అయిన ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. అస‌లు జాన‌ప‌ద సినిమాలు అప్ప‌టి త‌రంలో ఎవ‌రైనా చేసే సాహ‌సం కూడా చేయ‌ట్లేదు. అలాంటి టైంలో బాల‌య్య ధైర్యంగా ఈ త‌ర‌హా పాత్ర చేసి హిట్ కొట్టాడు. ఈ సినిమాలో పాట‌లు విశేష ప్రాచుర్యం పొందాయి. న‌రుడా ఓ న‌రుడా ఏమి కోరిక పాట‌కు ఎస్‌. జాన‌కి ఉత్త‌మ నేప‌థ్య గాయ‌కురాలిగా అవార్డు ద‌క్కించుకున్నారు. అలాగే ఉత్త‌మ సినిమాగా నంది అవార్డు సొంతం చేసుకుంది. సింగీతం శ్రీనివాస‌రావు ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా అవార్డు గెలుచుకున్నారు.

అలాగే ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం శ్రీ తుంబుర నార‌ద అనే పాట‌కు ఉత్త‌మ నేప‌థ్య గాయ‌కుడు అవార్డు గెలుచుకున్నాడు. అలాగే బాల‌య్య‌కు 1994లో ఉత్త‌మ ఫిల్మ్‌ఫేర్ అవార్డు ద‌క్కింది. ఇలా ఎన్నో ప్ర‌త్యేక‌త‌ల‌కు నిల‌యంగా ఈ సినిమా నిలిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news